Skip to content

శ్రీ చైతన్య స్కూల్‌లో ఘనంగా ఇన్వెస్టిచర్‌ సెర్మొనీ

హైదరాబాద్‌ మెహిదీపట్నంలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్‌లో ఇన్వెస్టిచర్‌ సెర్మొనీ (అధికార బాధ్యతల స్వీకార వేడుక) ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ, బాధ్యతాయుత భావనను పెంపొందించడంతో పాటు, భవిష్యత్‌లో సమాజానికి బాధ్యతాయుతమైన నాయకులుగా ఎదిగేలా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ వేడుకకు సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆనంద్‌ కుమార్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు విద్యతో పాటు నిజాయితీ, సేవాభావం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను అలవరచుకోవాలని సూచించారు. చిన్ననాటి నుంచే బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడం నేర్చుకుంటే భవిష్యత్‌లో ఉన్నత స్థాయికి ఎదగడానికి అది ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు.

ప్రత్యేక అతిథిగా పాల్గొన్న శ్రీచైతన్య పాఠశాల మెహిదీపట్నం జోన్‌ ఏజీఎం బి. కృష్ణ మాట్లాడుతూ.. విద్యార్థులు తమకు ఉన్న సామర్థ్యాన్ని గుర్తించి ఉన్నతమైన లక్ష్యాలను నిర్దేశించుకోవాలని సూచించారు. లక్ష్యాలను చేరుకునేందుకు క్రమశిక్షణతో, పట్టుదలతో ముందుకు సాగాలని అన్నారు. మెహిదీపట్నం జోన్‌ ఆర్‌ఐ ఎన్‌. స్వాతి గౌరవ అతిథిగా హాజరై నూతనంగా ఎన్నికైన విద్యార్థి నాయకులకు అభినందనలు తెలిపారు. తమకు అప్పగించిన బాధ్యతలను అంకితభావంతో, సమర్థవంతంగా నిర్వహించాలని ఆకాంక్షించారు.

కార్యక్రమంలో భాగంగా శ్రీచైతన్య మెహిదీపట్నం పాఠశాల ప్రిన్సిపాల్‌ విజయలక్ష్మి నూతనంగా ఎన్నికైన విద్యార్థి నాయకులతో పదవీ ప్రమాణం చేయించారు. అనంతరం వారికి బ్యాడ్జీలను అందజేశారు. హౌస్‌ ఆఫ్‌ సీజర్స్, హౌస్‌ ఆఫ్‌ కింగ్స్, హౌస్‌ ఆఫ్‌ రాయల్స్, హౌస్‌ ఆఫ్‌ ఫరావోస్‌ హౌస్‌ కెప్టెన్లతో పాటు ఇతర విద్యార్థి ప్రతినిధులు ప్రమాణ స్వీకారం చేసి తమ బాధ్యతలను అధికారికంగా స్వీకరించారు.

ఈ సందర్భంగా విద్యార్థుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. నాయకత్వ బాధ్యతలు స్వీకరించిన విద్యార్థులను పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు అభినందించి, తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ తోటి విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలని సూచించారు. కార్యక్రమంలో శ్రీచైతన్య పాఠశాల మెహిదీపట్నం డీన్‌ మల్లేష్‌, ఇన్‌చార్జిలు యాదగిరి, అరుణ, పీఈటీలు అనిత, కృష్ణ, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Back To Top